గోరా టెక్నో హబ్ ప్రారంభోత్సవం ఘనంగా...

 విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచేందుకు గోరా టెక్నో హబ్  కీలక పాత్ర పోషించాలని డీ.ఆర్.డీ.ఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడ





 బెంజ్ సర్కిలులో నాస్తిక కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోరా టెక్నో హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) ఫార్మర్ చైర్మన్, డిఫెన్స్ మినిస్టర్ సైన్టిఫిక్ అడ్వైజర్, గవర్నింగ్ బాడీ ఆఫ్ ద ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి విచ్చేసి హబ్ ప్రారంభించారు. 


ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ సతీష్ రెడ్డి ప్రసంగిస్తూ తరతరాలుగా సమాజం కోసం దేశం కోసం పరితపిస్తున్న గోరా కుటుంబం సమాజంలోని రుగ్మతలు, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలపై పోరాటం సాగించిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలతో పురోగమిస్తూ శాస్త్ర విజ్ఞానం పట్ల పిల్లలు, యువతలో ఆసక్తి పెంచేందుకు అనునిత్యం గోరా కుటుంబం కృషి చేస్తున్నారన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ గోరా సైన్స్ హబ్ లో స్పేస్ సైన్స్, రోబోటిక్స్, జన్యుపరమైన అంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీలతో సహా అనేక అంశాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ హబ్ మరింత అభివృద్ధి చెందినందుకు తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ సతీష్ రెడ్డి ప్రకటించారు. 


అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సమాజంలో నెలకొన్న అపోహలు తొలగించి ప్రజలను ముందుకు తీసుకు వెళ్ళడమే లక్ష్యంగా గోరా కుటుంబం పని చేస్తోందన్నారు. సామాజిక వేత్తగా గోరా చేసిన కృషిని వారి కుటుంబ సభ్యులు నేటికీ నిరంతరాయంగా కొనసాగించడం అపూర్వం అన్నారు. భారతదేశ గర్వించదగ్గ అత్యుత్తమ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డి చేతులమీదుగా ఈ గోరా టెక్నో హబ్ ప్రారంభించుకోవటం సంతోషదాయకం అన్నారు.