పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు

 



*ఏపీలో పలువురు అధికారులపై చర్యలు..* 


 *పల్నాడు ఎస్పీ బింధుమాధవ్‌ కూడా సస్పెండ్* 


 *పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు* 


 *తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌ బదిలీ* 


 *పల్నాడు, అనంతపురం ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దని ఆదేశాలు* 


అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను ఏపీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్నాడు జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్‌తో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణకాంత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ బింధుమాధవ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. అధికారుల బదిలీ, సస్పెన్షన్ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ జవహర్ రెడ్డి పంపించారు.

కాగా.... ఏపీలోని పలు జిల్లాలో పోలింగ్ రోజు(మే13 ) నుంచి అల్లర్లు, అరాచకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లను అదుపు చేయడంలో ఆయా జిల్లాల అధికారులు నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ మండిపడింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది..