రాజకీయపార్టీల హామీలపై ఎన్నికల సంగం కీలక వాఖ్యలు

 

CEC On Election Promises : ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీల ఇచ్చిన హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల్లో ఇచ్చే హామీల సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్​ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో నగదు, ఉచితాల పంపిణీని నిరోధించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు.


CEC On Election Promises : రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, అయితే ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఎన్నికల్లో నగదు, ఉచితాల పంపిణీని నిరోధించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు. ఆన్​లైన్ లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యతలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(NPCI) అప్పగించామని తెలిపారు. ఈ మేరకు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు.


సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ఫేక్ న్యూస్​పై స్పందించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. 'ఎన్నికల తేదీలు ప్రకటించారని ఫేక్​ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు వివరణ ఇచ్చాం. తమిళనాడులో మెజార్టీ రాజకీయ పార్టీలు ఒకే దశ ఎన్నికలను కోరుతున్నాయి. ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను కలిసింది. ఆయా పార్టీలు తమిళనాడు ఒకే దశలో ఎన్నికలు, నగదు, ఉచితాల పంపిణీని అరికట్టమని కోరాయి.