ఈ ముగ్గురు కుర్రాళ్లు నాటు బాంబులు




కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్‌ మొదలుకానుంది. అన్ని టీమ్‌లు ప్రస్తుతం దాదాపుగా సన్నాహాలు మొదలుపెట్టాయి. టీమ్‌లో లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌లు ఎక్కువగా ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్‌ టీమ్‌ తరచూ ఫీల్గింగ్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాటింగ్‌ టీమ్‌కి మేలు చేస్తుంది. అంతే కాకుండా లైనప్‌లో లెఫ్ట్ హ్యాండర్లు, రైట్ హ్యాండర్ల కలయిక ఉంటే లైన్‌లు, లెంగ్త్‌లను అడ్జస్ట్‌ చేసుకోవడం బౌలర్‌లకు కష్టం అవుతుంది. టీమ్‌లో టాప్, మిడిల్ ఆర్డర్‌లో పవర్-ప్యాక్డ్ లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే ఫీల్డింగ్ చేసే టీమ్‌కి సవాళ్లు తప్పవు. ఇప్పుడు టీమ్ ఇండియా ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్ల డెడ్లీ కాంబినేషన్‌ని తీసుకొచ్చింది. ముగ్గురు ప్లేయర్‌ల ఆటతీరు విభిన్నంగా కనిపిస్తున్నా.. అందరిలో కనిపించే లక్ష్యం పవర్‌ హిట్టింగ్‌. ఆ ప్లేయర్స్‌ ఎవరు, టీమ్‌ ఇండియా ప్లాన్స్‌ ఎలా ఉండాలో? ఇప్పుడు చూద్దాం. అదరగొడుతున్న లెఫ్ట్‌ హ్యాండర్లు T20 ప్రపంచ కప్ 2024కి ముందు భారత్‌కు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రింకూ సింగ్ రూపంలో బెస్ట్‌ ఆప్షన్లు లభించాయి. ఈ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్లు ముగ్గురూ మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చేయగలరు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో T20Iలో జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులు చేశాడు. పవర్ హిట్టింగ్, క్లాస్ స్ట్రోక్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంటర్నేషనల్‌ టీ20లలో శివమ్‌ దూబే అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాడు. 32 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. దూబే పవర్‌ హిట్టింగ్‌తో భారత్‌ ఈజీగా విజయం దక్కించుకుంది. T20I ఫార్మాట్‌లో గత కొన్ని నెలలుగా భారత్‌ టాప్ ఫినిషర్‌గా రింకూ సింగ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. లోయర్-మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్ దూకుడు టీమ్‌కి మేలు చేస్తోంది. ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు ప్లేయింగ్ XIలో ఈ ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు, మరో ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉంటే ఆపోజిట్‌ టీమ్‌కి కష్టాలు తప్పవు. బౌలర్లు తమ ప్రణాళికలను నిరంతరం మార్చుకోవాల్సి వస్తుంది. ఇది మెన్ ఇన్ బ్లూకి కలిసొచ్చే అంశం. ఓపెనింగ్‌లో జైస్వాల్ దూకుడు, మిడిల్ ఆర్డర్‌లో దూబే దాడి, రింకూ సింగ్ ఫినిషింగ్‌ని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువు కాదు. వీరి ముగ్గురితోపాటు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు టీమ్‌ ఇండియాకు ప్రతిభావంతులైన చాలా మంది లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్లు ఉన్నారు. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే.. వీళ్లకి ప్లేయింగ్ XIలో చోటు కల్పించడం. T20 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసుకునేటప్పుడు సెలెక్టర్లకు ఇది పెద్ద సమస్య. వీళ్లకి ప్లేస్‌ ఇవ్వాలంటే, కొంత మంది టాప్‌ ప్లేయర్‌లని పక్కన పెట్టాల్సి వస్తుంది. జైస్వాల్‌ రూపంలో భారత్‌కి టాప్‌ ఆర్డర్‌లో బెస్ట్‌ బ్యాటర్‌ దొరికాడు. తనదైన రోజు జైస్వాల్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించగలడు. దుబే ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ప్లేస్‌ని సమర్థంగా రీప్లేస్‌ చేయగలడు. రింకు సింగ్‌ భారత్‌కి దక్కిన మరో బెస్ట్‌ ఫినిషర్‌. ఏ స్థానంలో వచ్చినా వేగంగా పరుగులు చేయగలడు. ఈ మూడు ఆప్షన్‌లను సెలక్టెర్లు పరిశీలిస్తే వరల్డ్‌ కప్‌లో భారత్‌ పైచేయి సాధించే అవకాశాలు పెరుగుతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.